Ayodhya Ram Mandir: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన అంతా రామమయంలా కనిపిస్తుంది. .జై శ్రీరామ అన్న నినాదాలతో మారుమోగుతోంది. జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు శ్రీరాముని దర్శించాలని దేశ ప్రజలు కుతుహలంతో ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ఇప్పటికే అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా, మరికొందరు తొందర్లో వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఏదైమైనా ప్రస్తుతం ఆ ప్రాంతంలో జనాల తాకిడి మామూలుగా లేదనే చెప్పాలి. ఈ సందర్భంలో అయోధ్యలోని ఓ హోటల్ టీ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ) సదరు రెస్టారెంట్ యజమానులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అసలు అక్కడ ఏం జరిగిందంటే..
(ఇదీ చదవండి: ఇది కదా కిక్కు.. ప్రపంచంలోనే టాప్లో ఇండియన్ యూట్యూబ్ ఛానెల్.. ఎవరిదో తెలుసా! )
బిల్లు చూసి షాక్!
గత వారం, ఓ వ్యక్తి(Ayodhya )అయోధ్యలోని ‘శబరి రసోయ్’ అనే రెస్టారెంట్లోకి వెళ్లి రెండు కప్పుల టీ, రెండు ‘వైట్ టోస్ట్ ఆర్డర్ చేసి తిన్నాడు. అనంతరం వెయిటర్ తెచ్చిన బిల్లు చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే బిల్లు ప్రకారం, రెండు టీలు, రెండు టోస్ట్లు పన్నులతో కలిపి మొత్తం రూ.252 అని ఉంది. అందులో ఒక టీకి రూ.55 , ఒక టోస్ట్కి రూ.65. బిల్ వేశారు. ఈ బిల్లు వ్యవహారం అటు ఇటు చేరి చివరికి సోషల్మీడియాలో వైరల్ మారి రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఏడీఏ వెంటనే రెస్టారెంట్ యజమానికి షో-కాజ్ నోటీసు జారీ చేసింది.
ఈ అధిక ధరల అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఏడీఏ.. దీనిపై మూడు రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో అధికార యంత్రాంగం తన ఒప్పందాన్ని రద్దు చేస్తుందని రెస్టారెంట్ను ఆదేశించింది. ఈ రెస్టారెంట్ అరుంధతీ భవన్లో ఉంది, ఇది కొత్తగా నిర్మించిన బహుళ-అంతస్తుల వాణిజ్య భవనం, దీనిని రామ మందిరం సమీపంలోని తెహ్రీ బజార్లో ఏడీఏ అభివృద్ధి చేసింది. ఈ రెస్టారెంట్ అహ్మదాబాద్కు చెందిన M/s కవాచ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ యాజమాన్యంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
వివరణ తీసుకుంటాం
అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ దీనిపై మాట్లాడుతూ అయోధ్యకు వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో.. వారి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టు విధానం రూపొందించాం. అందులో వసతి, పార్కింగ్, భోజనం వంటి వాటికి తగిన బడ్జెట్ ధరలకే విక్రయించాలన్నారు. కాగా దీనిపై త్వరలో వివరణ తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇదంతా కావాలనే చేస్తున్నారు
శబరి రసోయ్ హోటల్ ప్రతినిధి మాట్లాడుతూ… పెద్ద, పెద్ద హోటళ్లలో ఉండే సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇదంతా ఒక కుట్ర, ధరలో విషయంలో కావాలనే కొందరు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధికార నోటీసులకు సంబంధించి మా వైపు నుంచి సమాధానం ఇచ్చామని అన్నారు.
అయితే, నెట్టింట దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అధిక ధరలపై మండిపడుతూ కామెంట్లు పెట్టగా.. మరికొందరు నెటిజన్లు హోటల్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు అందించే సౌకర్యాలు, నాణ్యతలను అనుసరించి ఈ ధరలు ఉంటాయని.. వీటిని సమర్థిస్తూ కామెంట్ పెడుతున్నారు.