Ola Electric Sales: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టూ వీలర్ మార్కెట్లో ఓలాకు మంచి గుర్తింపు ఉండగా.. ఆ సంస్థ నుంచి తగ్గింపు ధరకు బైకులు అందుబాటులోకి వచ్చేసరికి ప్రజల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ క్రమంలో తక్కువ సమయంలో వేల స్కూటర్లను విక్రయించింది.
ఓలా పలు రకాల మోడల్ బైకుల ధరను దాదాపు రూ.25 వేల తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలా ఆఫర్ ప్రకటించారో లేదో కేవలం మూడు రోజుల్లోనే 10 వేల స్కూటర్లు విక్రయించింది. ఈ విషయాన్ని ఓలా కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. ఓలా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంస్థ 72 గంటల్లోనే దాదాపు 10 వేల స్కూటర్లు అమ్ముడయ్యాయి.
(( దీనిపై ఓ లుక్కేయండి: సామాన్యులకు శుభవార్త.. అదిరిపోయేలా కొత్త స్కీం.. 300 యూనిట్ల ఉచిత కరెంట్! ))
సేల్స్ అదిరిపోయాయ్
బెంగళూరు కేంద్రంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ఫిబ్రవరి 16వ తేదీన తమ ఈ-స్కూటర్లపై దాదాపు రూ.25 వేల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వాటి వివరాలపై లుక్కేద్దాం. S1 X+, S1 Air, S1 Pro బైక్ ధరలను భారీగా తగ్గించింది. Ola ఫ్లాగ్షిప్ మోడల్ బైక్ అయిన S1 ప్రో గతంలో దీని ధర రూ. 1,47,500 లక్షలు, (ఎక్స్-షోరూమ్) ఉండగా.. ప్రస్తుతం తగ్గింపు ధర అనంతరం రూ. 1,30 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్ బైక్ ధరని రూ. 17,500 తగ్గించింది.
S1 ఎయిర్ బైక్ ధర తగ్గింపులో కాస్త తక్కువ అయినప్పటికీ.. కస్టమర్ల నుంచి దీనికి మంచి ఆదరణ లభించింది. ఈ మోడల్ బైక్ ధరను రూ. 15,000 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దీని కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.05 లక్షలకు చేరుకుంది. మునుపటి ధర చూస్తే రూ. 1.20 లక్షలుగా ఉండేది. కంపెనీ లైనప్లో అత్యంత సరసమైన మోడల్ అయిన Ola S1 X+ ధరను బాగా తగ్గించింది. దాదాపు రూ. 25,000 ధర తగ్గింపు Ola S1X+ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.10 లక్షల నుండి రూ. 85,000కి తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర అనేక ICE పోటీదారుల కంటే తక్కువ.
టాప్లో కొనసాగుతోంది
ఇటీవలే ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (PLI)కి ఓలా ఎలక్ట్రిక్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ కంపెనీ పలు మోడల్ బైక్ ధరలను తగ్గించడం గమనార్హం. ఓలా నుంచి ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ప్రో స్కూటర్లు పీఎల్ఐ సర్టిఫికేషన్ సాధించాయి. దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఓలాకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ గుర్తింపుని కాపాడుకుంటూ మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ తన హవాను కొనసాగుతోంది.
ఈ ఏడాది 2024, జనవరి నెలలో 42 శాతం మార్కెట్ వాటాతో 32, 293 స్కూటర్లు విక్రయించగా.. తర్వాత స్థానంలో టీవీఎస్ మోటర్స్ 15, 279 యూనిట్ల విక్రయించింది. బజాజ్ 10,855 యూనిట్లు విక్రయించి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఓలా ఎలక్ట్రిక్ తమ మొత్తం ఉత్పత్తి లైనప్ కోసం 8-సంవత్సరాల/80,000 కిమీ పొడిగించిన బ్యాటరీ వారంటీని కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్వర్క్ను 50 శాతం విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది, ఇది ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రస్తుత 414 సర్వీస్ సెంటర్ల నుండి సుమారు 600 కేంద్రాలకు పెరుగుతుందని పేర్కొంది.