ఐపీఎల్ 2024లో దేశవాలీ కుర్రాళ్లు అదరగొడుతున్నారు. మొన్న అంగ్క్రిష్ రఘువంశీ.. నిన్న శశాంక్ సింగ్.. ఇవాళ నితీశ్ రెడ్డి.. జట్లు, మ్యాచ్లు మారుతున్నాయే తప్ప యువ ఆటగాళ్ల ప్రతిభ మాత్రం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఆడిన సూపర్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ విజయానికి మూలకారణం. కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచినప్పటికి నితీశ్ రెడ్డి చేసిన 64 పరుగులే జట్టుకు కీలకంగా మారాయి.
విషయంలోకి వెళితే.. వంద పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన దశలో ఎస్ఆర్హెచ్ మళ్లీ కోలుకుంటుందా అని అనిపించింది. మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీశ్.. ఓవైపు వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా దూకుడుగా ఆడాడు. రబాడ లాంటి బౌలర్లను కూడా లెక్క చేయకుండా సిక్సులు, ఫోర్లు బాదిన నితీశ్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
ఆంధ్రా క్రికెట్ జట్టులో సభ్యుడైన నితీశ్ రెడ్డి.. కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. మంచి పేస్ ఆల్రౌండర్ కూడా. బ్యాట్తోపాటు బంతితోనూ సమానంగా రాణించగల సత్తా అతడి సొంతం. పంజాబ్తో మ్యాచ్లోనూ 3 ఓవర్లు బౌలింగ్ చేసిన నితీశ్ 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడంతోపాటు.. ఒక వికెట్ తీసి, ఒక క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీశ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లి ఆటను ఎంతో ఇష్టపడే నితీశ్ రెడ్డి టీనేజ్లో ఉన్నప్పుడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చేవాడు. అదే సమయంలో న్యూ బాల్ బౌలర్గానూ రాణించేవాడు. అయితే నితీశ్ రెడ్డిపై అది ఒత్తిడి పెంచే అవకాశం ఉండటంతో కోచ్లు అతణ్ని మిడిలార్డర్లో బ్యాటింగ్కు రమ్మని సూచించారు.
2020లో పేస్ ఆల్రౌండర్గా ఆంధ్రా జట్టుకు ఎంపికైన నితీశ్ రెడ్డి.. 2021 నుంచి జట్టులో రెగ్యులర్ సభ్యుడయ్యాడు. వరుసగా రెండు రంజీ సీజన్లలో 25 వికెట్ల చొప్పున తీసిన నితీశ్.. ఈ సీజన్లో ఆంధ్రా తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. నితీశ్ యార్కర్లు వేయడంతోపాటు.. బౌన్సర్లు కూడా వేస్తాడని.. డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగలడని ఆంధ్రా కోచ్ నిర్మల్ తెలిపారు. 2021 సీజన్లో నితీశ్ రెడ్డి చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్గా వ్యవహరించడం గమనార్హం.
నితీశ్ రెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో కష్టపడ్డారు. నితీశ్ మంచి క్రికెటర్ అవుతాడని నమ్మిన తొలి వ్యక్తి ఆయనే. కబడ్డీ ప్లేయర్ అయిన ముత్యాల రెడ్డి 9వ ఏటనే నితీశ్ రెడ్డిని క్రికెట్ అకాడమీలో చేర్చారు. విశాఖపట్నం హిందూస్థాన్ జింక్లో ఉద్యోగి అయిన ముత్యాల రెడ్డికి ఉదయ్పూర్ బదిలీ అయ్యింది. అయితే కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దడం కోసం ఆయన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు.
నితీశ్ రెడ్డి అండర్-16లో ఏడు మ్యాచ్ల్లోనే 1237 పరుగులతో సత్తా చాటాడు. నాగాలాండ్పై 442 రన్స్ చేసిన నితీశ్.. కర్ణాటకపై ట్రిపుల్ సెంచరీతోపాటు హైదరాబాద్పై డబుల్ సెంచరీ చేశాడు. ఆంధ్రా నుంచి నమన్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్గా నితీశ్ రెడ్డి గుర్తింపు పొందాడు. అండర్-16 కేటగిరీలో బెస్ట్ క్రికెటర్గా బీసీసీఐ నితీశ్ను గుర్తించింది. నితీశ్ రెడ్డి తన ప్రతిభను మెరుగుపర్చుకుంటూ.. మరింత కష్టపడి ఆడితే.. భారత జట్టులో మంచి పేస్ ఆల్రౌండర్గా చోటు దక్కించుకోవడం ఖాయమని చెప్పొచ్చు.