Sunrisers Hyderabad.. ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్హైదరాబాద్ మరింత డేంజరస్గా తయారైంది. సౌతాఫ్రికాలో జరిగిన తొలి ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అక్కడ చూపించిన తెగువలో కనీసం సగమైనా చూపించినా చాలు అనుకున్నారు.. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు. కానీ మ్యాచ్లు సాగేకొద్దీ రైజర్స్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. మ్యాచ్ మ్యాచ్కు విధ్వంసం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గినట్లు మాత్రం అనిపించడం లేదు. విధ్వంసం అనే మాట కూడా రైజర్స్ బ్యాటింగ్కు చిన్న పదం అనే చెప్పొచ్చు.
బాదుడే లక్ష్యంగా..
అసలు ఏంది ఈ అరాచకం.. ఆడుతుంది రైజర్స్ జట్టేనా అనేలా ధ్వంసరచన కాండ సృష్టిస్తోంది. అసలు ఒకే సీజన్లో ఒకసారి 250 ప్లస్స్కోర్లు సాధించేందుకే మిగతా జట్లు కష్టపడుతుంటే ఎస్ఆర్హెచ్ మాత్రం ఆ ఫీట్ను మూడుసార్లు సులువుగా అందుకుంది.. అది కూడా ఒకే సీజన్లో. రైజర్స్ విధ్వంసం ఇలాగే కొనసాగితే ఇదే సీజన్లో 300 ప్లస్ స్కోరు కూడా చూడడం ఖాయంగా కనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్కు వచ్చిందంటే చాలు విధ్వంసమే. స్టేడియం ఊగిపోవాల్సిందే. చేతులెత్తి ఎత్తి అంపైర్లు అలసిపోవాల్సిందే. డ్యాన్స్లు చేసి చీర్ లీడర్ల కాళ్లు నొప్పులు పుట్టాల్సిందే. మొదటి బంతి నుంచే ఊచకోత. చివరి బంతి వరకు అదే బౌండరీల మోత. ఓక మోస్తారు స్కోరు చేయడం.. మళ్లీ దాన్ని ప్రత్యర్థి అందుకుంటుందేమో అని కంగారు పడటం.. ఇవన్నీ ఎందుకు? ముందుగానే ప్రత్యర్థికి అందని స్కోరు చేస్తే ఎలాంటి ఆందోళన లేకుండా ఉండొచ్చని అనుకున్నారేమో సన్రైజర్స్ బ్యాటర్లు శివాలెత్తుతున్నారు. తమ బౌలర్లకు ఒత్తిడి తొలగిస్తున్నారు.
ఇలాగే ఆడితే 400 కూడా కొట్టేస్తారు..
సన్రైజర్స్ను మొదట బ్యాటింగ్కు ఆహ్వానించాలంటేనే ప్రత్యర్థి జట్లకు భయం పుట్టేలా.. బౌలింగ్ చేయాలంటేనే వణుకు వచ్చేలా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. సొంత స్టేడియంలో ఆడుతున్నామా? ప్రత్యర్థి మైదానంలో ఉన్నామా? అనే తేడా లేదు. రైజర్స్ కొట్టడం చూస్తే 300 ఏంటి.. నాలుగు వందలైనా ఈజీగా కొట్టేస్తుంది. రానున్న మ్యాచ్ల్లో రైజర్స్ను పరుగులు చేయకుండా ఆపాలంటే ప్రత్యర్థి జట్లకు ఒక్కటే మార్గం. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయడమే తప్ప వేరే చాన్స్ లేదు. టాస్ ఓడి రైజర్స్ బ్యాటింగ్కు దిగిందో ఆ విధ్వంసం ఊహకందని విధంగా ఉంటుంది.
ఇంత మార్పు ఎలా?
ఒకప్పుడు బౌలింగ్ బలంతోనే ఒకసారి చాంపియన్గా నిలిచిన సన్రైజర్స్ దాదాపు ప్రతీ సీజన్లో బ్యాటింగ్ కంటే బౌలింగ్ బలంతోనే మ్యాచ్లు గెలిచేది. కానీ ఈ సీజన్లో పూర్తిగా గేర్ మార్చింది. రైజర్స్ ఇంతలా మారడం గురించి ఒక కారణం చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ టైటిళ్లు అందించిన కమిన్స్ ఈసారి కెప్టెన్గా రావడమే పెద్ద మార్పు. సీజన్కు ముందే ఈసారి రైజర్స్ జట్టు దూకుడుగా ఆడుతుందని కమిన్స్ హెచ్చరిక జారీ చేశాడు. ట్రెవిస్ హెడ్ను రైజర్స్ను కొనుగోలు చేయడంతోనే ఆ జట్టుకు అదృష్టం కలిసి వచ్చింది.
ఏ ముహుర్తానా హెడ్ జట్టులోకి వచ్చాడో తెలియదు కానీ అతని బ్యాట్కు విరామం అన్నదే లేకుండా పరుగుల విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే ఒక శతకం చేసిన హెడ్ 216 స్ట్రైక్రేట్తో 324 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 215కు పైగా స్ట్రైక్రేట్తో 257 పరుగులు సాధించాడు. ఇక హెడ్ 300 పరుగులు కొట్టడం తమ లక్ష్యమని ముందే చెప్పాడు. త్వరలోనే అది కూడా నెరవేరేరోజు వచ్చేలానే కనిపిస్తోంది. వేగవంతమైన టీ 20 క్రికెట్ను తన బ్యాటింగ విధ్వంసంతో మరో స్థాయికి తీసుకెళ్లడంలో విజయవంతమైంది.
చదవండి: Heinrich Klaasen: సిక్సర్ల క్లాసెన్కు గురువులు ఎవరో తెలుసా?