T20 World Cup 2024.. పుష్కరకాలంగా ఐసీసీ టైటిల్ కోసం పరితపిస్తోన్న టీమిండియా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. ఐర్లాండ్ చిన్న జట్లే అయినప్పటికీ రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగి విజయంతో ప్రపంచకప్ వేటను షురూ చేసింది. గ్రూప్ భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. తొలిసారి ఐసీసీ మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో.. రోహిత్ సేన తమ సత్తాచాటింది. అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులను దిల్ఖుష్ చేస్తూ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో సత్తాచాటింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించగా.. ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది.
T20 World Cup 2024: కప్పు కొట్టినోళ్లకు 20 కోట్లకు పైగా ప్రైజ్మనీ
గెరెత్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. భారత పేసర్ల ధాటికి ఐరిష్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో గెరెత్ తర్వాత రెండో అత్యధిక స్కోరు ఎక్స్ట్రాలే (15) కావడం విశేషం. జోష్ లిటిల్ (14), కాంఫర్ (12), టకర్ (10) ఓ మాదిరిగా ఆడారు. మన బౌలర్లలో సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో అదుర్స్ అనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ రిషబ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ముందే ఊహించినట్లుగా.. యశస్వి జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ ఓపెనర్ అవతారమెత్తాడు. ఇటీవల ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఓపెనర్గా పరుగుల వరద పారించిన కోహ్లీ.. ఈ మ్యాచ్లో అదే జోరు కనబర్చలేకపోయాడు.
క్రీజులో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించిన విరాట్.. తానెదుర్కొన్న 5 బంతికి డీప్ థర్డ్మ్యాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే లక్ష్యం పెద్దది కాకపోవడంతో టీమిండియాకు ఇబ్బంది లేకుండా పోయింది. రోహిత్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అతడికి పంత్ చక్కటి సహకారం అందించాడు. ఫిఫ్టీ మార్క్ అందుకున్న తర్వాత రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. పంత్ మిగిలిన లాంఛనాన్ని ముగించాడు. సూర్యకుమార్ యాదవ్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెన్ వైట్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడనుంది. బౌలర్లకు అనుకూలంగా కనిపిస్తున్న పిచ్పై షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మొహమ్మద్ ఆమిర్, హారిస్ రవూఫ్ లాంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లను టీమిండియా ఎలా ఎదుర్కోనుందన్నది ఆసక్తికరంగా మారింది.