MS Dhoni: ఎంఎస్ ధోని కెప్టెన్సీ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కెప్టెన్ గా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో భారత్ కు ఎన్నో విజయాలు కట్టబెట్టాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కెప్టెన్ గానే కాక బ్యాటర్ గా విలువైన పరుగులు సాధించాడు. ఇక కీపింగ్ విషయంలో ధోనిని తలదన్నే ఆటగాడు లేడు. ఇన్ని ఘనతలు సాధించిన ధోని ఐపీఎల్ లో మాత్రం ఎందుకు విఫలమవుతాడు. అతను పట్టిందల్లా బంగారమే అవుతుంది తప్ప ఇత్తడి కాదన్నది నానుడి. తన మాస్టర్ మైండ్ తో ప్రత్యర్థుల ఆట కట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా సీఎస్ కే కు పేరుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడంతో పాటు.. అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్టుగా.. ఎక్కువసార్లు ప్లేఆఫ్స్ ఆడిన జట్టుగా సీఎస్ కే రికార్డులకెక్కింది.
ధోనీ అండగా ఉండగా
ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్ కే జట్టు కెప్టెన్ గా ఉన్న ధోని ఈసారి మాత్రం కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. నేను ఎంతకాలం ఆడతానో తెలియదు.. సీఎస్ కేకు కొత్త కెప్టెన్ అవసరముంది అని ధోని పేర్కొన్నాడు. దీంతో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. అయితే కెప్టెన్సీ అనుభవం లేని రుతురాజ్ కు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని ధోని మాట ఇచ్చి ఉంటాడు. అందుకే మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రుతురాజ్ కంటే ధోని హైలెట్ గా నిలిచాడు. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో చాలా సందర్భాల్లో ధోని ఫీల్డింగ్ ను సెట్ చేస్తూ కెమెరాలకు చిక్కాడు. అవసరమైన దశలో రుతురాజ్ కు సలహాలిస్తూ ఏ బౌలర్ తో బౌలింగ్ వేయించాలన్నది కూడా సూచించినట్లు తెలుస్తోంది. శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ లాంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్ చేర్చడంలో ధోని పాత్ర కీలకం అని చెప్పొచ్చు. ధోని తన మాస్టర్ మైండ్ తో బౌలర్ కు ఎక్కడ బంతులు వేస్తే వికెట్లు తీయచ్చన్నది ముందే గ్రహించాడు. అందుకే ఈతరంలో దిగ్గజ కెప్టెన్లలో ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
తగ్గని ధోనీ క్రేజ్
ఇక ఎన్ని సీజన్లు వచ్చినా ధోని చరిష్మా మాత్రం తగ్గడం లేదు. గతేడాది ఐపీఎల్ లో సీఎస్ కే ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడికి ప్రేక్షకులు పోటెత్తేవారు. కారణం ధోని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది కూడా కేవలం ధోనిని చూసేందుకే జనాలు ఎగబడుతున్నారు. ధోని బ్యాటింగ్ కు రాకున్నా పర్లేదు.. అతని ముఖం చూసినా చాలు అన్నట్లుగా అభిమానుల ధోరణి ఉంది. అందుకే గుజరాత్ తో మ్యాచ్ లో ధోని పెద్ద స్క్రీన్ పై కనిపించిన ప్రతీసారి స్టేడియం మొత్తం ధోని పేరు దద్దరిల్లిపోయింది. ఏ ఆటగాడికైనా ఒక దశాబ్దం పాటు క్రేజ్ ఉంటుంది. కానీ ధోని రిటైరై మూడేళ్లు కావొస్తున్నా అతనిపై అభిమానం మరింత రెట్టింపు అవుతుందే తప్ప తగ్గడం లేదు.
అదరగొట్టిన చెన్నై
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 63 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సిక్సర్ల శివమ్ దూబే(23 బంతుల్లో 51 పరుగులు) మరోసారి చెలరేగి ఆడడం.. ఓపెనర్లు రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 46 పరుగులు)లు శుభారంభం అందించారు. అనంతరం 207 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ 8 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వగా.. సాయి సుదర్శన్ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.సీఎస్ కే బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో గుజరాత్ బ్యాటర్లు ఏం చేయలేకపోయారు. చేయాల్సిన పరుగులు ఎక్కువ కావడం.. నెట్ రన్ రేట్ పెరుగుతుండడంతో ఒత్తిడిలో వికెట్లు చేజార్చుకుంది.చివరకు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీపక్ చహర్, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్ పాండే తలా రెండు వికెట్లు తీశారు. సిక్సర్లతో మెరుపు అర్థశతకం సాధించిన శివమ్ దూబేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.