Deepthi Jeevanji.. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలిగా జన్మించడంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.. వైకల్యంతో బాధపడుతున్న ఆమెకు ఎప్పటికీ పెళ్లి కాదని.. ఎంతకాలం బతికినా బతుకు భారమే తప్ప ఎందుకు పనికిరాదంటూ ఆమె తల్లిదండ్రులు ఎన్నో సూటిపోటీ మాటలు ఎదుర్కున్నారు. కానీ పుట్టిన బిడ్డ తమకు ఏమాత్రం బారం కాదని భావించిన ఆ నిరుపేద తల్లిదండ్రులు.. విమర్శించిన వారి నోళ్లు మూయించే విధంగా తమ బిడ్డను తయారు చేయాలనుకున్నారు. ఎన్నో కష్టాలకోర్చి బిడ్డను అంతర్జాతీయ స్థాయి అథ్లెట్గా తీర్చిదిద్దారు. అందుకనుగుణంగానే వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తూ పట్టుదలతో రాణించి ఇవాళ అందరి చేత శభాష్ అనిపించుకుంది జివాంజి దీప్తి. ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకంతో మెరిసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి ఔరా అనిపించింది. కదనరంగంలో చిరుతలా దూసుకెళ్తున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ దీప్తిపై ప్రత్యేక కథనం..
తెలంగాణ పారా అథ్లెట్ జివాంజి దీప్తి అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో దీప్తి పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీలో దీప్తి 55.07 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో 20 ఏళ్ల దీప్తి ప్రపంచ రికార్డు టైమింగ్ నమోదు చేసింది. నిరుడు ఇదే చాంపియన్షిప్లో అమెరికా అథ్లెట్ బ్రియాన్నా క్లార్క్ పేరిట ఉన్న రికార్డు (55.12 సెకన్లు) ను దీప్తి బద్దలు కొట్టింది. పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన ఈ ఓరుగల్లు బిడ్డ.. ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లోనే అదే జోరు కొనసాగిస్తూ.. ప్రత్యర్థులకు అందకుండా అగ్రస్థానం దక్కించుకుంది. టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ (55.19 సెకన్లు), ఈక్వెడార్కు చెందిన లిజాన్షెలా అంగులో (56.68 సెకన్లు) వరసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
Read More: Sunrisers Hyderabad: నాలుగేళ్ల తర్వాత ప్లేఆఫ్స్కు హైదరాబాద్.. థాంక్యూ ఆరెంజ్ ఆర్మీ
తెలంగాణ గడ్డ నుంచి మరో ఆణిముత్యం అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించింది. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన జివాంజి దీప్తి వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 400 మీటర్ల టీ20 కేటగిరీలో స్వర్ణం పతకం దక్కించుకుంది. నిరుడు హాంగ్జౌ వేదికగా జరిగిన పారా ఆసియా గేమ్స్లో పసిడి పతకంతో మెరిసిన దీప్తి.. ప్రపంచ అథ్లెటిక్స్లోనూ దుమ్మురేపింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన దీప్తి పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు.
దీంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారంటూ ఊరివాళ్లు తరచూ వెటకారంగా మాట్లాడేవారు. కానీ ఇవన్నీ పట్టించుకోని దీప్తి తల్లిదండ్రులు ఆమెను కష్టపడి పెంచారు. దీప్తి తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దృష్టిలో పడింది. ట్రాక్పై చిరుతను తలపిస్తున్న దీప్తికి మెరుగైన శిక్షణ ఇస్తే.. అద్భుతాలు చేయగలదని నమ్మిన నాగపురి రమేశ్.. దీప్తి దీప్తి తల్లిదండ్రులతో మాట్లాడి హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఒప్పించాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో దీప్తి పేరును రిజిస్టర్ చేయించిన రమేశ్ ఆమె శిక్షణను దగ్గరుండి పర్యవేక్షించాడు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న దీప్తికి మొదట్లో శిక్షణ ఇచ్చేందుకు రమేశ్ చాలా కష్టపడాల్సి వచ్చింది.క్రమంగా అర్థం చేసుకున్న రమేశ్.. దీప్తి ఇవాళ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్గా ఎదగడంలో కీలకపాత్ర పోషించాడు. కెరీర్ ఆరంభంలో సాధారణ అథ్లెట్లతో కలిసి పోటీపడి జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన దీప్తి.. పారా విభాగంలోకి మారిన తర్వాత ఎదురన్నదే లేకుండా ముందుకు సాగుతోంది.
Read More: టీమిండియా కొత్త కోచ్ ఎవరు? ఆ క్రికెటర్కే ఛాన్స్!
దీప్తి ఎదుగుదలలో బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ పాత్ర కూడా ఉంది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమ్పవర్మెంట్లో దీప్తి చేరడంలో గోపీచంద్ ముఖ్యపాత్ర పోషించారు. అన్ని మెడికల్ టెస్టుల తర్వాత దీప్తిని ‘మెంటల్ ఇంపెయిర్’్డగా గుర్తిస్తూ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ దీప్తి పారా అథ్లెట్స్లో పోటీ పడేందుకు దోహదం చేసింది. దీప్తికి అంతర్జాతీయ లైసెన్స్ దక్కేందుకు గోపీ ఫౌండేషన్ రెండు అంతర్జాతీయ ఈవెంట్స్లో దీప్తికి స్పాన్సర్గా వ్యవహరించింది. అలా అంతర్జాతీయ పారా అథ్లెట్గా ఎదిగిన దీప్తి జీవాంజి గతేడాది పారా ఆసియా గేమ్స్లో 400 మీటర్ల టీ20 కేటగిరీలో స్వర్ణం సాధించింది. అప్పటిదాకా దీప్తి తల్లిదండ్రులను హేళన చేసిన ఊరివాళ్లు ఆమె ఘనతను చూసి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. ఇప్పటికే పారాలింపిక్స్కు అర్హత సాధించిన దీప్తి దేశానికి పతకం అందించాలనే పట్టుదలతో ఉంది.