India: 32 ఏళ్ల నుంచి అందని ద్రాక్షగా ఉన్న దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విక్టరీ కోసం.. ఎన్నో ఆశలతో సఫారీల గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియాకు భంగం పాటు ఎదురైంది. సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో మ్యాచ్లో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది భారత్. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలన్న కల ఈసారి కూడా కలగానే మిగిలిపోయింది. చివరి రెండో టెస్టులో రోహిత్ సేన గెలిచినప్పటికీ 1-1తో సిరీస్ సమం అవుతుంది. ఇదిలా ఉండగా మొదటి టెస్టు ఓటమి నుంచి తేరుకోకముందే టీమిండియాకు మరో షాక్ తగిలింది.
భారత్కు ఊహించని షాక్
సెంచూరియన్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాపై పెనాల్టీ విధించింది ఐసీసీ. ఈ కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో నుంచి టీమిండియా 2 కీలకమైన పాయింట్లను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు పెనాల్టీలో భాగంగా ఐసీసీ భారత జట్టు మ్యాచ్ ఫీజులో 10% జరిమానా కూడా విధించింది .ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఏ జట్టు అయినా తమకిచ్చిన నిర్ణీత గడువులోపు ఓవర్ల కోటాను పూర్తి చేయాలి. ఒకవేళ అలా ఓవర్లను పూర్తి చేయలేకపోతే ఆ జట్టు ఆటగాళ్ల ఫీజులో 5 శాతం కోత విధిస్తారు.
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ రెండు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో నిబంధనల ప్రకారం టీమిండియా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. టెస్ట్ ఓటమి తర్వాత, భారత్ 16 పాయింట్లు, 44.44 పాయింట్ల శాతంతో అయిదో స్థానంలో నిలిచింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అదనంగా మరో రెండు పాయింట్లు కోల్పోయింది. ఈ కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా కంటే దిగువన 14 పాయింట్లు, 38.89 పాయింట్ల శాతంతో ఆరో స్థానంకి పడిపోయింది.
పేలవంగా సాగిన బ్యాటింగ్
కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ ఓటమిపై మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టెస్టులో భారత్ మరింత మెరుగ్గా ఆడాల్సిందని అంగీకరించాడు.ఆతిథ్య జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను పూర్తిగా దెబ్బతీసిందని, ఫలితంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుందన్నాడు. సాధారణంగా టెస్ట్ మ్యాచ్లు గెలవాలంటే, సమిష్టిగా కలిసి ఆడాల్సి ఉంటుంది…అయితే ఈ మ్యాచ్లో భారత్ ఆ వ్యూహాన్ని అనుసరించలేకపోయిందని వ్యాఖ్యానించాడు.
ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో తమ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా సాగిందని భారీ తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. సౌతాఫ్రికా జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో రాణించారని వారి విజయానికి అదే కీలకంగా మారిందని చెప్పుకొచ్చాడు. ఒత్తిడిలోనూ కేఎల్ రాహుల్ ప్రదర్శన బాగుందని కితాబిచ్చిన రోహిత్.. రెండో టెస్టు కోసం సిద్దమవుతున్నట్లు తెలిపాడు.