IPL Matches: టి20 క్రికెట్ మెరుపులకు పెట్టింది పేరు. ఎక్కడ టి20 లీగ్ లు జరిగితే అక్కడికి వాలిపోతారు వెస్టిండీస్ ఆటగాళ్లు. జాతీయ జట్టుకు ఆడడం కంటే బయటి లీగుల్లో ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీనికి కారణం లేకపోలేదు. విండీస్ బోర్డు ఆర్థిక నష్టాలు.. పారితోషికం విషయంలో ఆటగాళ్లతో విభేదాలు తరచూ ఉండేవే. అందుకే విండీస్ బోర్డుతో కుదరక చాలా మంది విండీస్ ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్ కంటే ప్రైవేట్ లీగ్ ల్లోనే ఎక్కువగా దర్శనమిస్తుంటారు.
కరీబియన్ ఆటగాళ్లు మమేకమైపోయారు
క్రికెట్ లో క్రేజీ టోర్నీలుగా గుర్తింపు పొందిన బిగ్ బాష్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), కరిబీయన్లీగ్ సహా ఇటీవలే మొదలైన ఇంటర్నేషనల్ లీగ్ టి20.. ఇలా చెప్పుకుంటూ పోతే విండీస్ క్రికెటర్లు పాల్గొనని టోర్నీ అంటూ లేదు. తాజాగా ఐపీఎల్ మరోసారి మొదలు కావడంతో విండీస్ క్రికెటర్లు జ్ఞప్తికి రావడం ఖాయం. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్లు ఐపీఎల్ లో మమేకమైపోయారు. క్రిస్ గేల్ మొదలుకొని.. డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, షిమ్రోన్ హెట్ మైర్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, డారెన్ సామి, కీమర్ రోచ్ ఇలా చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతూనే వస్తున్నారు. ఆడడమే కాదు మెరుపులు మెరిపించడంలోనూ విండీస్ వీరులు ముందు వరుసలో ఉంటున్నారు.
మ్యాచ్లు పోతున్నా మారని ఆర్సీబీ.. గెలవాలంటే వాటిపై ఫోకస్ చేయాల్సిందే!
ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ లోనూ నలుగురు విండీస్ ఆటగాళ్లు ఆయా జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్.. ఈ ఇద్దరు ప్రస్తుతం కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేకేఆర్ వరుస విజయాలు అందుకోవడంలో ఈ ఇద్దరి పాత్ర కీలకం. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ లో రసెల్ విధ్వంసం సృష్టించాడు. కేవంల 25 బంతుల్లోనే 64 పరుగులు సాధించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లోనూ 19 బంతుల్లోనే 41 పరుగులు చేసి కేకేఆర్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో అతను చేస్తున్న విధ్వంసం కారణంగానే కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును అందుకుంది. చాలా ఏళ్ల నుంచి కేకేఆర్కు ఆడుతున్నప్పటికి.. ఈసారి గంభీర్ మెంటార్గా రావడంతో రసెల్ మరింత సంయమనంతో ఆడుతున్నాడు.
అదరగొడుతున్న నరైన్
ఇక సునీల్ నరైన్ మరోసారి ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. 2017 సీజన్లో ఓపెనర్గా ప్రమోషన్ పొంది నరైన్ కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న గంభీర్.. ఈసారి మెంటార్గా రావడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన నరైన్ మరోసారి బ్యాటుతో రెచ్చిపోతున్నాడు. అయితే మునుపటిలా ఎడాపెడా బాది ఔటవ్వకుండా కచ్చితత్వంతో ఆడుతూ భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. గతంలో బౌలర్గా అదరగొట్టిన నరైన్ ఈసారి బ్యాటుతోనే తనదైన ప్రదర్శన చేస్తూ విజృంభిస్తున్నాడు. ఓపెనర్గా వస్తూ ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేకేఆర్కు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు.
ఇక ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న రొమారియో షెపర్డ్ను ఎందుకు హిట్టర్ అంటారనేది ఒక్క మ్యాచ్తోనే నిరూపించాడు. కేవలం 10 బంతుల ఇన్నింగ్స్తోనే తానెంటో నిరూపించాడు షెపర్డ్. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లోనే 32 పరుగులు చేసిన షెపర్డ్ బౌలింగ్లోనూ వికెట్ తీసి ముంబై తొలి విజయం అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్ ఫినిషర్గా ఆకట్టుకున్నాడు.
గుజరాత్ పై 32 నాటౌట్, ఆర్సీబీపై 40 నాటౌట్, పంజాబ్ పై 42, రాజస్తాన్ పై 64 నాటౌట్.. వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో పూరన్ చేసిన స్కోర్లు.. ఈ నాలుగు మ్యాచ్ల్లోనూ లక్నో విజయాలు సాధించడం విశేషం. చూడడానికి బక్కపలుచగా ఉండే పూరన్.. భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. లక్నోకు మిడిలార్డర్ లో వెన్నుముకలా నిలుస్తూ వస్తున్నాడు. ఈ నలుగురే కాక ఆసీస్తో టెస్టు సిరీస్ లో గడగడలాడించిన షమర్ జోసెఫ్ అరంగేట్రం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఎంతైనా వెస్టిండీస్ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్ ఉండడం అసాధ్యం. ఆటతో పాటు మంచి వినోదాన్ని అందించడం వారికి బాగా అలవాటు. దానిని మన భారత అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు.