Irfan Pathan Questions Bcci Contracts Over Shreyas, Kishan Issue: ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్షిక క్రాంటాక్టుల విషయంలో బీసీసీఐ అనుసరించిన తీరుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విస్మయం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. వీటితో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఇలాంటివి నష్టం చేస్తాయ్
2023-24 ఏడాదికి గానూ బీసీసీ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల విషయంలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించిందని పలువురు భావిస్తున్నారు. బీసీసీఐ మాత్రం క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తే ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని ఇద్దరి పేర్లను పక్కన పెట్టడం ద్వారా.. జట్టులోని మిగతా ఆటగాళ్లకు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఇర్ఫాన్ పఠాన్ దీనిపై స్పందిస్తూ.. భారత జట్టు ముందున్న లక్ష్యాలు సాధించేందుకు ఇలాంటి పోకడలు నష్టం చేకూరుస్తాయని ఘాటు విమర్శలు చేశాడు. వీళ్లద్దరూ రంజీ టోర్నీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశారన్న కారణంగానే వీళ్లిద్దరికి మొండిచేయి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందరికీ రూల్స్ వర్తించాలి
‘‘శ్రేయస్, ఇషాన్ జట్టులోని ప్రతిభావంతులైన క్రికెటర్లు. వీరిద్దరూ తిరిగి పుంజుకుని రెట్టింపు ఉత్సాహంతో కమ్బ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నా. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడకూడదు అనుకున్నపుడు.. అలాంటి పరిస్థితుల్లో కనీసం దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా వాళ్లను ఆడిస్తే బాగుంటుంది కదా?
((వారేవ్వా.. వాట్ ఏ బౌలింగ్! 4 బంతుల్లో .. 4 వికెట్లు పడగొట్టిన భారత యువ పేసర్!))
జాతీయ జట్టుకు దూరమైనపుడు సమయంలో వాళ్లు నియమాల ప్రకారం కూడా దేశవాళీ బరిలో దిగాల్సి ఉంటుంది కదా? ఒక నిబంధన ప్రవేశపెడితే అది ఆటగాళ్లందరికీ వర్తింపచేయాలి.. అలా కాక కొందరికే అనుకుంటే అది భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేదు’’ అని ఎక్స్ వేదికగా పఠాన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
కాగా గతేడాది వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి పాండ్యా మళ్లీ టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, త్వరలో ప్రారంభం కానున్న రిచ్ లీగ్ ఐపీఎల్-2024లో మాత్రం ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగేందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ , ఇషాన్ కిషన్ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా, లేదా భవిష్యత్తులో కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది.