SSMB29: సంక్రాంతి బొనాంజాగా విడుదలైన గుంటూరు కారం టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లను రాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాను మరో సారి నిరూపించింది. ఇటీవల గుంటూరు కారం చిత్ర యూనిట్ సక్సెస్ వేడుకలను జరుపుకుంది. అయితే ప్రస్తుతం ప్రిన్స్ అభిమానుల కళ్లంతా SSMB 29 మీదే ఉంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందించడమే అందుకు కారణం.
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా పట్టాలెక్కనున్న ఈ చిత్రంపై అటు మహేశ్ ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ పుకార్లపై స్పందిస్తూ చిత్ర యూనిట్ నుంచి ఓ వార్త బయటకు వచ్చింది.
భారీ బడ్జెట్తో నెవర్ బీఫోర్
ఇటీవల మహేశ్ బాబు తన తదుపరి చిత్రం కోసం జర్మనీకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం SSMB29 వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతోంది. ప్రఖ్యాత రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను కూడా పూర్తి చేశారు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ‘ఇండియానా జోన్స్’లా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కథ అత్యధిక భాగం అడవి నేపథ్యంలో సాగుతుందని తెలిపారు.
ఇదిలా ఉండగా దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమాపై ప్రస్తుతం నెట్టింట నిర్మాతకు సంబంధించి కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ని నిర్మించేందుకు నిర్మాత కెఎల్ నారాయణతో కొంతమంది ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు జతకట్టినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ( దీనిపై ఓ లుక్కేయండి: వామ్మో, డేంజర్ జోన్లో శ్రీలీల.. ఎందుకు ఆ తప్పు చేస్తోంది! )
అదంతా పుకార్లే
దీంతో SSMB29 ప్రొడక్షన్ టీం నుంచి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్ట్కు కేఎల్ నారాయణ ఏకైక నిర్మాత అని.. అంతేకాకుండా ఇది ఆయన బ్యానర్ దుర్గా ఆర్ట్స్పై నిర్మించబోతున్నారని తెలిపారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లు మాదిరి నిర్మాత నారాయణ ఈ సినిమా కోసం మరే ఇతర నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కాలేదని ధృవీకరించాయి. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది.
కాగా ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఇతర కీలక నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఈ తరహా పనులన్ని పూర్తి చేసుకుని ఆపై సినిమా వివరాలను రాజమౌళి స్వయంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ఇండియన్ సినిమా స్టామినా ప్రపంచానికి తెలిసింది. మరి హాలీవుడ్ తరహాలో తెరకెక్కుతున్న SSMB29 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సునామి సృష్టిస్తుందో చూడాలి.