Manchu Vishnu: తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి కూడా ‘నవతిహి ఉత్సవం పేరిట ఘనంగా ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. మలేషియాలో నవతిహి పేరిట త్వరలో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరపనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్క్ హయత్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో మా ప్రెసిడెంట్ విష్ణు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నటి మధుమిత శివబాలాజి వ్యవహరించారు. 1932 నుంచి తెలుగు సినిమా గొప్పదనం గురించి, 1993 లో మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తెలిపి.. గత రెండేళ్లలో ‘మా’ చేసిన పనులని వివరించారు. మధుమిత శివబాలాజి అనంతరం విష్ణు ఈ ప్రెస్ మీట్ని లాంఛనంగా ప్రారంభించారు.
మలేషియాలో కలుద్దాం
మలేషియా టూరిజం డైరెక్టర్ ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ మాట్లాడుతూ.. ‘మలేషియా టూరిజం డైరెక్టర్ తరపున నేను ఇక్కడికి వచ్చాను. జులైలో ‘మా’ ఈవెంట్ మలేషియాలో జరగబోతుంది. విష్ణుకి ధన్యవాదాలు. టూరిజం మలేషియా ఈ ప్రోగ్రాంకి మద్దతు చేస్తున్నందుకు మా టూరిజం ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది, మలేషియాలో కలుద్దాం’ అని చెప్పారు.
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితమే 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైనప్పటికీ నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించాలని అనుకున్నాం. కానీ కుదరడం లేదు. ఈ ఈవెంట్ నుంచి “మా” కోసం ఫండ్ రైజింగ్ చేయాలని అనుకుంటున్నాం. ఈవెంట్ ను జులైలో మలేషియాలో చేయబోతున్నాము. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సినీ పరిశ్రమ పెద్ధలతో మాట్లాడి తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ నవతిహి ఉత్సవం చేయబోతున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ దక్కడం చాలా గొప్ప విషయం.
మన జై బాలయ్య అనే మాట అంతటా వినిపిస్తుంది. నా సోదరుడు అల్లు అర్జున్ తొలిసారిగా టాలీవుడ్లో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ప్రభాస్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా యాక్టర్గా ఎదిగాడు. ఇలా ఎన్నో సాధిస్తున్నాము. అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాము. మలేషియా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘మా’లో దాదాపు 800 కి పైగా ఆర్టిస్టులు ఉండగా.. అందులో కొందరే బాగా సెటిల్ అయినవాళ్లు. మిగిలిన వాళ్లకు అండగా నిలబడటానికి ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నామన్నారు.