ఐపీఎల్ 2024 సీజన్ లో మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతున్నాయి. సీజన్ కొనసాగుతున్న కొద్ది మ్యాచ్ లు మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ను పంచుతున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ కు వారి సొంతగడ్డపైనే ఝలక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్. 200 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో ఒక దశలో 111 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ఒకడు వచ్చాడు.. వచ్చీ రాగానే విధ్వంసం చేయలేదు. ఆరంభంలో పది బంతుల పాటు నిధానంగా ఆడిన అతను ఆ తర్వాత పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు.
మ్యాచ్లు పోతున్నా మారని ఆర్సీబీ.. గెలవాలంటే వాటిపై ఫోకస్ చేయాల్సిందే!
చాపకింద నీరులా పరుగులు రాబడుతూ కొండంత లక్ష్యాన్ని కరిగించేశాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం భయపడకుండా తన ఇన్నింగ్స్ ను కొనసాగించి ఆఖరి వరకు క్రీజులో నిలిచి పంజాబ్ కింగ్స్ కు అపరూప విజయాన్ని అందించాడు. ఆ ఆటగాడే శశాంక్ సింగ్. గుజరాత్ తో మ్యాచ్ కు ముందు వరకు శశాంక్ సింగ్ పేరును కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఇవాళ జట్టు వద్దనుకున్నోడే హీరోగా నిలిచాడు. మరి ఎవరీ శశాంక్ సింగ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంపికే పెద్ద గందరగోళం..
శశాంక్ సింగ్.. పంజాబ్ జట్టులోకి చాలా నాటకీయ పరిణామాల మధ్య వచ్చాడు. అతని ఎంపికే ఒక గందరగోళం అని చెప్పొచ్చు. వేలంలో అతని పేరు రాగానే మొదట పంజాబ్ కింగ్స్ వద్దనుకుంది. అయితే ఆ తర్వాత శశాంక్ సింగ్ ను రూ. 20 లక్షల కనీస ధరకే పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే తాము కొనాలనుకున్న వ్యక్తి శశాంక్ సింగ్ కాదని.. అదే పేరుతో ఉన్న మరో శశాంక్ అని పంజాబ్ కింగ్స్ తర్వాత వివరణ ఇచ్చింది. కానీ అప్పటికే వేలం ముగిసినట్లు వ్యాఖ్యాత తెలపడంతో పంజాబ్ అతన్ని జట్టులోనే ఉంచుకుంది. మేం కొనాలనుకునే ఆటగాళ్ల జాబితాలో శశాంక్ ఉన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు ఒకే పేరుతో ఉండడంతో గందరగోళం తలెత్తింది. అయితే సరైన శశాంక్ సింగే జట్టులోకి వచ్చాడని భావిస్తున్నాం.. అతనికి స్వాగతం అంటూ గతంలో పంజాబ్ కింగ్స్ ఎక్స్ లో పేర్కొంది. తాజాగా ఆ నమ్మకాన్ని శశాంక్ సింగ్ నిలబెట్టుకున్నాడు.
Source: IPL Twitter
శశాంక్ సింగ్ ను గుర్తించిన గబ్బర్..
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్.. శశాంక్ సింగ్ ఆటను దగ్గరనుంచి గమనించాడు. ఇటీవలే ముంబై లో జరిగిన డీవై పాటిల్ టి20 టోర్నీలో ధావన్.. శశాంక్ సింగ్ కెప్టెన్సీలోనే ఆడాడు. అతని కెప్టెన్సీలోనే దినేశ్ కార్తిక్, ఆయుష్ బదోని లాంటి ఆటగాళ్లు కూడా ఆడారు. అతని స్ట్రైక్ రేట్ ను దగ్గరి నుంచి గమనించిన ధావన్.. ఐపీఎల్ లో సరిగ్గా వాడుకుంటే సత్ఫలితాలు వస్తాయని గుర్తించాడు. అందుకే తన కెప్టెన్సీలో శశాంక్ సింగ్ కు వరుసగా మ్యాచ్ అవకాశాలు ఇస్తూ వచ్చాడు.
శశాంక్ సింగ్ ను కొనసాగించడంపై ధావన్ స్పందిస్తూ.. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా నిరూపించుకునేది.. అతని ప్రతిభ నాకు తెలుసు.. త్వరలోనే అది బయటకు వస్తోంది. అని తెలిపాడు. తాజాగా ధావన్ తన పై పెట్టుకున్న నమ్మకాన్ని శశాంక్ సింగ్ వందకు వంద శాతం నిలబెట్టుకున్నాడు. ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి అందరు అతని గురించి మాట్లాడుకునేలా చేశాడు శశాంక్ సింగ్.
Source: IPL Twitter
శశాంక్ సింగ్ కెరీర్ ఎలా మొదలైందంటే..
ఇక డీవై పాటిల్ గ్రూప్ లో ఉద్యోగి అయిన శశాంక్ దేశవాలీ క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఎక్కువగా ముంబై తరపున ఆడిన శశాంక్ సింగ్ కెరీర్ లో ఎదగడంలో బీసీసీఐ జనరల్ మేనేజర్ అభయ్ కురువిల్లా సాయపడ్డాడు. శశాంక్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. దేశవాలీ క్రికెట్ లో 58 మ్యాచ్ లు ఆడిన శశాంక్ సింగ్ 754 పరుగులు చేశాడు. ఇక జాతీయ స్థాయిలో శశాంక్ సింగ్ ఛత్తీస్ గఢ్ కు ఆడుతుంటాడు. పంజాబ్ కింగ్స్ కంటే ముందు శశాంక్ సింగ్ ఎస్ ఆర్ హెచ్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.