Rishabh Pant.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దుమ్మురేపుతున్నాడు. యాక్సిడెంట్తో 14 నెలల పాటు క్రికెట్కు దూరమైన పంత్ ఐపీఎల్ ద్వారా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో ఎలా ఆడతాడో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్ల్లో 342 పరుగులు చేసిన పంత్ ఖాతాలో మూడు అర్థసెంచరీలున్నాయి. కాగా ఆరెంజ్క్యాప్ రేసులో పంత్ మూడో స్థానంలో ఉన్నాడు. లీగ్లో ఢిల్లీ ప్రదర్శన ఎలా ఉన్నప్పటికి పంత్ రాణించడం మాత్రం భారత జట్టుకు శుభసూచకం అని చెప్పొచ్చు. రానున్న టీ20 ప్రపంచకప్కు మే 1లోగా జట్టును ఎంపిక చేయాల్సి ఉన్నందున పంత్ ఎంపిక లాంఛనమే కానున్నట్లు సమాచారం. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, జితేశ్ శర్మల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికి రెగ్యులర్ కీపర్గా పంత్కే ప్రాధాన్యమిచ్చే అవకాశముంది.
Read More: Sunrisers Hyderabad: విధ్వంసం కొనసాగేనా?.. 300 పరుగులే లక్ష్యంగా బరిలోకి ఎస్ఆర్హెచ్
రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ తిరిగి క్రికెట్ ఆడతాడా? అనే సందేహాలు ఒక దశలో వినిపించాయి. ఒకవేళ ఆడినా మునుపటి జోరు కొనసాగిస్తాడా? అనే ప్రశ్నలు తలెత్తాయి. వీటన్నింటికీ ఈ ఐపీఎల్ సీజన్లో సమాధానం ఇచ్చాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. కీపింగ్ బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తాడనే వారి నోళ్లు మూయించాడు. ఎడమచేతి వాటం, మిడిలార్డర్లో దూకుడుగా ఆడటం పంత్కు కలిసొచ్చే అంశాలు. జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మన మ్యాచ్లు ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయి. ఇక 2013 తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. కనీసం ఈ పొట్టి కప్తోనైనా ఆ నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. ఆ దిశగా జట్టుకు పంత్ ఎంతో అవసరం. అంతేకాదు రోహిత్ తర్వాత భారత కెప్టెన్ రేసులో పంత్ ఒక బలమైన పోటీదారుగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Read More: RCB Team: బెంగళూరుకు ఇది అలవాటే కదా.. ‘ప్లేఆఫ్’ అవకాశాలు ఎంత?