Rohit Sharma.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30న) 37వ పడిలోకి అడుగపెట్టాడు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా ఉన్న రోహిత్ దేశానికి టీ20 ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో నెల రోజుల్లో ఈ ప్రపంచకప్ జరగనుంది. మరి ఆటగాడిగా తన కెరీర్లో చివరి దశలో ఉన్న హిట్ మ్యాన్ ఎలాగైనా పొట్టి ప్రపంచకప్ను దేశానికి అందించాలని భావిస్తున్నాడు. గతేడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ ఫైనల్లో ఓటమి పాలవ్వడంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు బద్దలయ్యాయి. ఈసారి అమెరికా, వెస్టిండీస్ మధ్య సంయుక్తంగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్ ఎలాగైనా విజయం సాధించాలని ప్రతి అభిమాని కోరకుంటున్నాడు.
హిట్ మ్యాన్గా పిలవబడే రోహిత్ శర్మ 30 ఏప్రిల్ 1987లో నాగ్పూర్లో జన్మించాడు. రోహిత్ శర్మ అమ్మ పూర్ణిమ శర్మ సొంత ఊరు విశాఖపట్నం. నాన్న గురునాథ్ శర్మ ఒక ట్రాన్పోర్ట్ కంపెనీలో పని చేసేవారు. రోహిత్ శర్మ తన తాతయ్య, నానమ్మ దగ్గరే పెరిగావడు. రోహిత్ శర్మ 1999లో క్రికెట్ కోచింగ్ ప్రారంభించాడు. రోహిత్ ముందు ఆఫ్ స్పిన్నర్గా క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. అయితే కోచ్ దినేశ్ లాడ్.. శర్మలో ఉన్న బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించి అతడిని బ్యాటింగ్ వైపు ప్రోత్సహించాడు. 2013 నవంబర్లో ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సచిన్ టెండుల్కర్ ఆడిన చివరి టెస్టు అదే. ఆ మ్యాచ్లో రోహిత్ 177 పరుగులు చేశాడు. అరంగేట్రం టెస్టులో రెండో అత్యధిక స్కోరుగా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ సిక్స్ కొట్టి సెంచరీ సాధించాడు. ఇది ఒక అరుదైన రికార్డు. రోహిత్ శర్మ వన్డేల్లో 150+ పరుగులు ఎనిమిది సార్లు సాధించాడు. గతంలో సచిన్, డేవిడ్ వార్నర్ పేరు మీద ఉన్న ఈ రికార్డులు ఇప్పుడు హిట్ మ్యాన్ పేరుతో ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా ఉంటూ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్గా రోహిత్ గుర్తింపు పొందాడు. 2015 డిసెంబర్లో తన మేనేజర్ అయిన రితికా సజ్దేను వివాహమాడాడు. రోహిత్ శర్మ 2007లో ఐర్లాండ్పై భారత జట్టుకు అరంగేట్రం చేశాడు . ఆరంభం అంతగా లేకపోయినా.. అనతికాలంలోనే అద్భుతమైన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో 2008 లో డెక్కన్ ఛార్జర్స్ తరపున =అరంగేట్రం చేశాడు. తరువాత 2011 నుంచి ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలవడం విశేషం. 2013,2015,2017,2019,2020లో ముంబై చాంపియన్గా నిలిచింది.
ఈ సీజన్లో ముంబై కెప్టెన్గా రోహిత్ను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పారు. అయితే పాండ్యా కెప్టెన్సీలో ముంబై సరైన ప్రదర్శన చేయలేకపోతుంది. ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో రోహిత్ కలగజేసుకొని పాండ్యాను ఎవరు విమర్శించొద్దని.. ఇది జట్టు సమిష్టి వైఫల్యం అని అభిమానులకు నచ్చచెప్పడంతో విమర్శలు ఆగిపోయాయి. ఎంతైనా భారత్ తరపున మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న రోహిత్ మాటకు విలువను ఇస్తూ అభిమానులు కూడా ట్రోల్ చేయడం మానేశారు. ఇక 37వ పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్ శర్మకు సహచర క్రికెటర్లు, మాజీల నుంచి పెద్ద ఎత్తున బర్త్డే విషెస్ వస్తున్నాయి.