SSMB29: సినిమా జనాల్లోకి ఈజీగా వెళ్లడానికి సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. టైటిల్ ఎంత క్యాచిగా, క్రేజీగా ఉంటే అంత ఎక్కువగా సినిమా పాపులర్ అవుతుంది. అయితే ఆల్రెడీ ఆస్కార్ స్థాయిలో క్రేజ్, స్టార్ట్ డమ్ సంపాదించుకున్న డైరెక్టర్, హీరో కాంబోలో వచ్చే సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టినా సరే జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది.
అయితే ఇంతకీ ఈ టైటిల్ వ్యవహారం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీ టైటిల్ మార్చబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
క్రేజీ కాంబో.. కొత్త ప్లాన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ SSMB29. ప్రిన్స్ జక్కన్న తొలి సారి జతకట్టడంతో ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజమౌళి.. SSMB29 ను హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్.
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
అంతే కాకుండా ఈ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలోనే అతి పెద్ద సినిమాగా మారబోతుందంటూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీని ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్న రాజమౌళి టైటిల్ విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండేలా చూస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఈ చిత్రం టైటిల్ SSMB29ను మార్చే యోచనలో ఉన్నట్లు ఓ వార్త వినపడుతోంది.
టైటిల్ ఇదేనా..
గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న మూవీ SSMB29. ఈ సినిమా మహేష్ కు 29వ సినిమా కానుంది. దీంతో ఈ చిత్రానికి SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్టుకు జక్కన్న క్రేజీగా ఇద్దరి పేర్లు వచ్చేలా… ఈ మూవీ టైటిల్ను మార్చబోతున్నారంటూ ఓ వార్త బయటకొచ్చింది. RRR మూవీ తర్వాత జక్కన్న క్రేజ్ అంతర్జాతీయంగా వినపడుతోంది. దీంతో రాజమౌళి పేరు వచ్చేలా SSMB29 కాస్త SSRMB గా ప్లాన్ చేస్తున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా పాన్ వల్డ్ రేంజ్లో ఈ సినిమా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ ఇది సహాయపడుతుందని టీం భావిస్తోందట. అందుకే ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ను SSMB29 నుంచి SSRMB మార్చడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.అయితే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. జక్కన్న గురించి తెలిసిందే క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా మూవీని తెరకెక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంటారు. అందుకే ఆయన సినిమాలు కాస్త ఆలస్యం అవుతుంటాయి.