బాహుబలి తర్వాత భారీ హిట్ కోసం రెబెల్ స్టార్ ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేపోయాయి. దీంతో సలార్ మీదనే డార్లింగ్తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అంచనాలే పెట్టుకున్నారు. కేజీఎఫ్తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
సలార్ మూవీని ప్రశాంత్ తెరకెక్కించడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ విధ్వంసం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ బాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సలార్ దూకుడికి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సలార్ నిర్మాతలు దక్షిణాదిలోని కొన్ని మల్టీప్లెక్స్లలో సినిమా ప్రదర్శనను రద్దు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగింది..
వివరాల్లోకి వెళితే.., ‘సాలార్’ నిర్మాతలు తమ సినిమాను దక్షిణాదిలోని పీవీఆర్-ఐనాక్స్, మిరాజ్ సినిమాస్లో ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు టాక్. ఈ మల్టీప్లెక్స్ చైన్లు ప్రభాస్ నటించిన సలార్ కంటే షారుఖ్ ఖాన్ ‘డంకీ’కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధి ప్రకారం.. ముందస్తు అనుకున్నదాని ప్రకారం పీవీఆర్ ఐనాక్స్ మిరాజ్ సినిమాస్లో సలార్ డంకీ’ రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని అన్నారు. అయితే డంకీ విడుదల తర్వాత ఈ మాటను పక్కన పెట్టి పూర్తిగా షారుక్ సినిమాకే పెద్ద పీట వేశారు.
దీంతో ఆయా సంస్థల ఆధ్వర్యంలో నడిచే సింగిల్ స్క్రీన్స్లో పూర్తిగా డంకీ సినిమా ఆడే లాగా వారి మీద ప్రజర్ తీసుకొచ్చారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సౌత్ మొత్తం మీద పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సంస్థలకు చెందిన థియేటర్లలో సలార్ ఆడించేది లేదంటూ మేకర్స్ నిర్ణయానికి వచ్చారు. మరో వైపు నెట్టింట బ్యాన్ పీవీఆర్ ఐనాక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ను ట్రెండింగ్లో తీసుకొచ్చారు.
పీవీఆర్ సంస్థ స్పందన ఇదే…
ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో పీవీఆర్ సంస్థ సీఈవో దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. సాధారణంగా నిర్మాతలకు తమకు మధ్య ఉన్న విషయాలు బయటకు రానివ్వకుండా చూసుకుంటాం కానీ ఈ విషయంలో అసలు తమ ఉద్దేశం ఏంటో బయటకు చెప్పాలని అనిపిస్తుందని ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో మీడియాలో పీవీఆర్ ఐనాక్స్ సంస్థ ఈ రెండు సినిమాల విషయంలో సరైన రీతిలో స్పందించడం లేదని.. తప్పుడు ఉద్దేశంతో ముందుకు వెళుతుందనే వార్తలు చూశానని చెప్పుకొచ్చారు.
అయితే తమకు అందరూ నిర్మాతలు ఒక్కటేనని ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉండడం లాంటివి ఏమీ ఉండవన్నారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్న సమయంలో కొన్ని సార్లు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు, అయితే ఇదేమీ మొదటిసారి కాదు అలా అని చివరి సారి కూడా కాదు త్వరలోనే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఈలోపు మీరు అనవసరంగా కొత్త కొత్త స్టోరీలు పుట్టించవద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.