Mumbai Indians:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొస్తోంది. ఈ సీజన్లోనూ శశాంక్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ.. తాజాగా అశుతోష్ శర్మ లు సంచలనంగా మారారు. గురువారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అశుతోష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఒక పెను సంచలనం. ముంబైని దాదాపు ఓటమి అంచుల వరకు తీసుకొచ్చి వారికి భయం అంటే ఏంటో రుచి చూపించాడు.
Read More: Glenn Maxwell: ఐపీఎల్ 2024 సీజన్ నుంచి వైదొలిగిన గ్లెన్ మ్యాక్స్వెల్.. కారణం ఏంటంటే?
కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ను గెలిపించినంత పని చేశాడు. ఒకవేళ మ్యాచ్ పంజాబ్ గెలిచి ఉంటే ఇవాళ అశుతోష్ శర్మ పేరు మరింత మార్మోగిపోయేదే. అయినా ఇప్పటికి అతని గురించి ఎక్కువే చెప్పాల్సిన అవసరముంది.
మధ్యప్రదేశ్లోని రాత్లామ్ గ్రామానికి చెందిన అశుతోష్ శర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. కనీసం అంపైరింగ్ చేసైనా తనకిష్టమైన క్రికెట్లో కొనసాగాలని అనుకున్నాడు. కానీ ఇవాళ ఐపీఎల్ ద్వారా ఆల్రౌండర్గా ఎదిగి హార్డ్ హిట్టర్గా పేరు తెచ్చుకున్నాడు. రాత్లామ్కు చెందిన అశుతోష్ శర్మ కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే. అయినా అతను క్రికెట్పై ప్రేమను చంపుకోలేదు.
భారత మాజీ క్రికెటర్ అమే కురేషియా పరిచయం కావడం అశుతోష్ కెరీర్ను మలుపు తిప్పింది. అతడి అండతో నెమ్మదిగా వివిధ టోర్నీల్లో సత్తా చాటాడు. తిండి కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ తుది పోరులో 84 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. అయితే కోవిడ్-19 అతని ఎదుగుదలకు బ్రేక్ వేసింది. ఎంత రాణించినా రిజర్వ్బెంచ్కే ఎక్కువగా పరిమితమయ్యేవాడు. దీంతో ఇల్లు గడవడం కష్టమైపోయింది. క్రికెట్తో బంధాన్ని తెంచుకోవడం ఇష్టం లేక డబ్బులు వస్తాయన్న ఆశతో అంపైరింగ కూడా చేశాడు. క్రికెటర్గా ఎదగడం ఇక కష్టమే అనుకున్నాడు.
2023 ముస్తాక్ అలీ టోర్నీ అశుతోష్ జీవితాన్ని మలుపు తప్పింది. టీ20ల్లో 12 బంతుల్లో అర్థసెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన యువరాజ్ సింగ్ రికార్డును బద్దలుకొట్టాడు. అరుణాచల్ప్రదేశ్తో మ్యాచ్లో 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ఔరా అనిపించాడు. బంతిని బలంగా బాదడంలో అశుతోష్ సిద్ధహస్తుడు. ఇది టీ20లకు సరిగ్గా సరిపోతుందని భావించిన పంజాబ్ కింగ్స్ 2024 వేలంలో రూ.20 లక్షల కనీస ధరకే ఆల్ రౌండర్ను సొంతం చేసుకుంది. పంజాబ్ అతనిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
లోయర్ ఆర్డర్లో శశాంక్ సింగ్తో కలిసి పంజాబ్ ఇన్నింగ్స్లను నడిపిస్తున్నాడు. హైదరాబాద్పై 15 బంతుల్లోనే 33 పరుగులు.. ఇక గుజరాత్పై మ్యాచ్లో 17 బంతుల్లోనే 31 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక రాజస్థాన్పై 16 బంతుల్లోనే 31 పరుగులు.. తాజాగా ముంబైతో మ్యాచ్లో 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టును విజయం అంచుల దాకా తీసుకెళ్లాడు. సరిగ్గా వాడుకుంటే భారత జట్టులోనూ ఈ ఆటగాడు అద్బుతాలు చేయగలడు. మున్ముందు ఎలా రాణిస్తాడో చూడాలి మరి. ఆల్ ది బెస్ట్.. అశుతోష్ శర్మ..